BGV's World

*కాళిదాసు*

*మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*

*ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక,‘మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను’అని బదులిచ్చింది.*

*కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు’అని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి,మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*

*అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి. ‘నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.*

*ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*

*మీరేమో అలిసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు! అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*

*దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, ‘మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా ‘నేను అతిథిని!’ అని బదులిచ్చాడు.*

*మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు? అని అడిగింది.*

*ఓపిక నశించిన కాళిదాసు, ‘నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది.*

*ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.*

*విద్య, అధికారం, ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.*

1 year ago | [YT] | 0